ఆంధ్రప్రదేశ్ శాసనమండలి:ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు (బీజేపీ), కొణిదెల నాగబాబు (జనసేన), బీటీ నాయుడు(టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్(టీడీపీ), ఆలపాటి రాజేంద్రప్రసాద్(టీడీపీ)లతో అసెంబ్లీ భవనంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంలో దొంగలు రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ సహా కొందరి డబ్బుల్ని చోరీ చేశారు.

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటా, గ్రాడ్యుయేట్స్ కోటాలో ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుగురు ఎమ్మెల్సీలతో శాసనమండలి ఛైర్మన్ మోషేన్రాజు ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.. అసెంబ్లీలో ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఏకంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు దగ్గర రూ.10వేలు, ఆయన గన్మెన్ దగ్గర రూ.40వేలు, ఆయనతో వచ్చిన లాయర్ దగ్గర రూ.50 వేలు, మరొకరి దగ్గర రూ.32 వేలు చోరీ అయ్యాయని తెలుస్తోంది. మరికొందరి దగ్గర కూడా ఇలాగే డబ్బు పోయిందని చెబుతున్నారు. మొత్తం అక్కడ సుమారు రూ.4 లక్షలకుపైగానే చోరీ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఆవరణలో తొలిసారి దొంగతనం జరిగిందని చర్చించుకుంటున్నారట.
ఎమ్మెల్యేలో కోటాలా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు సోము వీర్రాజు (బీజేపీ), కొణిదెల నాగబాబు (జనసేన పార్టీ), బీటీ నాయుడు (టీడీపీ).. పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్ (టీడీపీ)లతో శాసనమండలి ఛైర్మన్ మోషేన్రాజు ప్రమాణం చేయించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటుగా ఎమ్మెల్యేలు చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పార్థసారథిలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ డబ్బు, గాడ్ఫాదర్లతో కాకుండా పనిచేసేవారికి పదవులొస్తాయన్నారు ఎమ్మెల్సీ బీటీ నాయుడు. దీనికి తానే నిదర్శనమని.. తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడమే ఉదాహరణగా చెప్పారు. ఎమ్మెల్సీల వెంట మద్దతుదారులు కూడా భారీగా తరలివచ్చారు.. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది.. ఈ సందట్లో సడేమియా అన్నట్లుగా దొంగలు రెచ్చిపోయారు.. చేతివాటం ప్రదర్శించారు.
అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, తన సతీమణి పద్మజతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్లి రాష్ట్ర సచివాలయంలో సీఎంతో సమావేశం అయ్యారు. చంద్రబాబు నాగబాబును శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. అంతకుముందు చంద్రబాబును నాగబాబు దంపతులు శాలువాతో సత్కరించిన పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలు సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానన్నారు. ప్రజా సంక్షేమం, జావాబుదారీతనం ప్రధాన లక్ష్యాలుగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వంలో.. ఎమ్మెల్సీగా తన కర్తవ్యాలను క్రమశిక్షణతో నిర్వహిస్తానన్నారు.చట్టసభలో ప్రజాగళం వినిపించే అవకాశం లభించేందుకు సహకరించినవారికి దన్యవాధాలు తెలియజేశారు. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.. ఐదు స్థానాల్లో టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి కేటాయించారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే.