Bird Flu::నరసరావుపేటలో ఐసీఎంఆర్ బృందం పర్యటన

పల్నాడు:

ఏపీలో తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఓ చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ నరసరావుపేటలో ఐసీఎంఆర్ బృందం పర్యటించింది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి ఇంటిని సందర్శించింది. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించింది. అనంతరం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి బాలిక మరణానికి గల కారణాన్ని వివరించింది.


నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్‌ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన ఘటనపై అధ్యయనం కోసం రాష్ట్రానికి వచ్చిన ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందంతో సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం తనను కలిసిన ఐసీఎంఆర్ బృందంతో బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ, ఇతర అనారోగ్య కారణాలు కూడా బాలిక మృతి చెందడానికి దారితీశాయని బృందం సభ్యులు చెప్పారు.

ఉడికించని మాంసం తినడం, చిన్నారి కావడంతో వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, లెప్టోస్పిరోసిస్(ఎలుకల విసర్జన వల్ల వ్యాపించే వ్యాధి), అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, 8 బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు.

చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, స్థానికుల నమూనాలు పరీక్షించామని, ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని చెప్పారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. దీంతో భవిష్యత్‌లో ఇలాంటి కేసులు నమోదుకాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో యాంటీవైరల్ డ్రగ్స్ సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు.

Scroll to Top