సుప‌రిపాల‌న కోసం రాష్ట్ర ప్రభుత్వానికి స‌ల‌హా మండ‌లి

  • స‌భ్యులుగా గేట్స్ ఫౌండేష‌న్‌, ఐఐటీ సహా వివిధ రంగాల నిపుణులు
  • జూన్ 12 కల్లా వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ పరిధిలోకి అన్ని సేవలు
  • ఆర్టీజీఎస్‌పై స‌మీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమ‌రావ‌తి: రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ స‌ల‌హా మండ‌లిలో గేట్స్ ఫౌండేష‌న్ నుంచి, అలాగే మ‌ద్రాసు ఐఐటీ, ఇత‌ర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణ‌లను సభ్యులుగా నియమించాలన్నారు. ప్రజలకు మరింత మేలు చేసేలా, సుప‌రిపాల‌న అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలన్నారు. సోమవారం సచివాలయంలో ఆర్జీజీఎస్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

వెయ్యికి పైగా సేవలకు అవకాశం :

ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవ‌లు కావాల‌న్నా ఆన్‌లైన్, డిజిట‌ల్, వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. మొబైల్ ఫోను ద్వారా మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించడంతో పాటు వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తృత పరిచేలా చూడాల‌న్నారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిట‌ల్ రూపంలో అందించ‌గ‌లిగే సేవ‌ల‌న్నిటినీ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్‌లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగ‌వంతంగా పూర్తి చేయాల‌న్నారు. మొత్తం 500 సేవలు వరకు వాట్సప్ ద్వారా అందించేందుకు వీలుందని, అయితే ప్రస్తుతం 254 సేవలు వాట్సప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకువచ్చామని… 1000కి పైగా సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు.

పర్యాటక ప్రాంతంగా ఓర్వకల్లు డ్రోన్ సిటీ :

ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించే ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఓర్వకల్లు దగ్గర ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ రాష్ట్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కేవ‌లం డ్రోన్ సిటీనే కాకుండా ఓర్వకల్లు పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు వంటి మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి… ఇక్కడ ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చెందేలా ప‌ర్యాట‌కాభివృద్ధి సంస్థ సహ‌కారంతో ఆధునికంగా హోట‌ల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Scroll to Top