ఇంటర్నెట్ డెస్క్: మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు (BS Yediyurappa) న్యాయస్థానం స్వల్ప ఊరట కల్పించింది. మార్చి 15న పోక్సో (Pocso) కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇటీవల ఆయనను ఆదేశించింది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.
తనపై నమోదైన పోక్సో కేసు విచారణకు సంబంధించిన విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కర్ణాటక హైకోర్టు స్వల్ప ఊరట కల్పించింది.
17 ఏళ్ల బాలికపై యడియూరప్ప (EX CM Yediyurappa) లైంగిక దాడికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గత ఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను భాజపా నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది.