Secunderabad-Saraswati Pushkaralu express: సరస్వతి పుష్కరాల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశి (వారణాశి) పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. తొమ్మిది రాత్రులు/ 10 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్ భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర, ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లల్లో ఈ ఎక్స్ప్రెస్కు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
ఈ ప్యాకేజీలో పూరీ- గయ- వారణాశి- అయోధ్య, ప్రయాగ్రాజ్ ఉన్నాయి. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు. గయ- విష్ణుపాద ఆలయం, వారణాశి- కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పూజల్లో పాల్గొనవచ్చు. అక్కడి కారిడార్ కూడా ఈ టూర్ ప్యాకేజీలో ఉంది.
అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించే అవకాశం ఉందీ టూర్ ప్యాకేజీ ద్వారా. ప్రయాగ్రాజ్తో ఈ ప్యాకేజీ టూర్ ముగుస్తుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్కు చేరుకుంటుంది .